Abhishek Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ హవా... అగ్రస్థానాల్లో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, బౌలర్ల జాబితాలో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.

బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ 909 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (821), పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ (769) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఏడు స్థానాలు ఎగబాకి 25వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తికి, రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌కు మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ ఒక స్థానం మెరుగుపరుచుకుని ఐదో ర్యాంకుకు చేరాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సికందర్ రజా, పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయూబ్‌ను వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్ల జాబితాలో తిరిగి నంబర్ వన్ కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రజా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక వికెట్ తీయడంతో పాటు, బ్యాటింగ్‌లోనూ రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. గతేడాది చివర్లో తొలిసారి ఈ ఘనత సాధించిన రజా, మళ్లీ ఇప్పుడు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
Abhishek Sharma
ICC Rankings
Varun Chakravarthy
T20 Rankings
Indian Cricket
Sikandar Raza
Cricket Rankings
Ishan Kishan
Arshdeep Singh
Cricket

More Telugu News