నరవణె పుస్తకం బయటకు ఎలా వచ్చింది?: పెంగ్విన్ సంస్థకు ఢిల్లీ పోలీసుల నోటీసులు

  • నరవణె రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకంపై రాజకీయ దుమారం
  • పుస్తకం ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఢిల్లీ పోలీసుల ఆగ్రహం
  • నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు
ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ 'పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా'కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకంకు సంబంధించి రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఈ పుస్తకం ప్రచురణ కానప్పటికీ రాహుల్ గాంధీ చేతికి ఈ కాపీ ఎలా చేరుకుందని ఇండియా టుడే డిజిటల్ మీడియాలో కథనం వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పుస్తకం లీక్ అయినట్లు పేర్కొంటూ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్  నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ఇంకా ప్రచురితం కాని ఆ పుస్తకానికి సంబంధించి పలు ప్రశ్నలను పోలీసులు సంధించారు. వాటికి పెంగ్విన్ నుండి సమాధానం అడిగారు. ప్రచురణ సంస్థ యాజమాన్యం విచారణలో భాగం కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వం అనుమతి పొందకముందే నరవణె రాసిన ఈ పుస్తకం బయటకు రావడం వివాదంగా మారింది. పుస్తకం ప్రచురితం కాలేదని, మార్కెట్‌లో అందుబాటులో లేదని ప్రచురణ సంస్థ 24 గంటల్లో రెండుసార్లు వివరణ ఇచ్చింది. కానీ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఆ పుస్తకం మార్కెట్‌లో లభ్యమవుతుందని అన్నారు. 


More Telugu News