టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

  • భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటానని వ్యాఖ్య
  • ఆసియా కప్‌లో మాదిరి కాకుండా ఇకపై జరిగే మ్యాచ్‌లు క్రీడాస్ఫూర్తితో జరగాలని ఆకాంక్ష
  • క్రికెట్‌కు రాజకీయాలను దూరంగా ఉంచాలన్న మహమ్మద్ హఫీజ్
టీ20 ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ ఈ నెల 15న తలపడనున్నాయి. తొలుత టీమిండియాతో ఆడేందుకు నిరాకరించిన పాకిస్థాన్ ఆ తర్వాత మనసు మార్చుకుంది. దీంతో కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నాడు. ఆసియా కప్‌లో మాదిరిగా కాకుండా ఇకపై జరిగే మ్యాచ్‌లు పూర్తి క్రీడా స్ఫూర్తితో జరగాలని ఆకాంక్షించాడు. అందుకు ఇరుజట్ల ఆటగాళ్లు సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు ఎప్పుడూ ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని అన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో ఇరుజట్ల మధ్య పోరు సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని అన్నాడు.

ఇకపై తరుచూ ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లు జరగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. క్రికెట్‌కు రాజకీయాలను దూరంగా ఉంచాలని పేర్కొన్నాడు. క్రికెట్ అభివృద్ధికి రెండు దేశాలు తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చాడు. రాజకీయ కారణాలతో క్రికెట్‌ను ఎప్పటికీ ఆపకూడదని సూచించాడు. ఫిబ్రవరి 15న జరగబోయే మ్యాచ్ క్రీడా స్ఫూర్తితో జరగాలని అన్నాడు. ఆసియా కప్ లాంటి మ్యాచ్‌లు అవసరం లేదని అన్నాడు. ఒకవేళ అలాగే ఆడితే మ్యాచ్‌ను చూడకపోవడమే మంచిదని అన్నాడు.

గత ఏడాది ఆసియా కప్‌లో మూడుసార్లు భారత్, పాకిస్థాన్ తలపడగా, అన్నింటా టీమిండియా విజయం సాధించింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఓ మ్యాచ్‌లో విజయం అనంతరం పాక్ క్రికెటర్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయలేదు. ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా పీసీబీ చీఫ్ మోహన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మహమ్మద్ హఫీజ్ పైవ్యాఖ్యలు చేశాడు.


More Telugu News