డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి... ఎమ్మెల్యే ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • శివకుమార్‌కు సీఎం పోస్టు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారన్న ఇక్బాల్ 
  • నిర్ణయం పార్టీ పెద్దల చేతుల్లోనే ఉందని వెల్లడి
  • తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ.. అందుకు తగినట్లుగా వ్యవహరించాలని వ్యాఖ్య
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని సుమారు 90 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారని, ఇప్పుడు ఆ నిర్ణయం పార్టీ పెద్దల చేతుల్లోనే ఉందని అన్నారు. తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, అందుకు తగినట్లుగా వ్యవహరించాలని అన్నారు.

యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రికి అనుకూలంగా పదేపదే మాట్లాడటం ఇబ్బందిగా మారిందని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడటం సరికాదని అన్నారు. డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలనేది మా అందరి కోరిక, దాని గురించి పదేపదే బహిరంగంగా ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించకూడదని అన్నారు.


More Telugu News