టీ20 ప్రపంచకప్: ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. కుటుంబాలకు 'నో'!

  • బోర్డు నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
  • ఆటగాళ్ల ఏకాగ్రత కోసమే ఈ కఠిన నిబంధనలు అని స్పష్టీకరణ
  • గతంలో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఈ విధానం పునరుద్ధరణ
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు బస చేసేందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించింది. ఈ విషయంలో తన కఠిన నిబంధనలకే కట్టుబడి ఉండాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించే విషయంపై స్పష్టతనివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరినప్పటికీ, బీసీసీఐ అందుకు అంగీకరించలేదని నివేదికలు పేర్కొన్నాయి.

నివేదికల ప్రకారం "ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండ‌టానికి వీల్లేద‌ని బోర్డు స్పష్టం చేసింది. అయితే, వారు కోరుకుంటే సొంతంగా వేరే ఏర్పాట్లు చేసుకోవచ్చు" అని ఓ అధికారి తెలిపారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం, 45 రోజులకు మించిన పర్యటనల్లో 14 రోజులు, అంతకంటే తక్కువ నిడివి గల టూర్‌లలో 7 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులను అనుమతిస్తారు.

గతంలో 2024లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3 తేడాతో, 2024-25లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలుగుతోందనే భావనతో కుటుంబాలపై ఆంక్షల విధానాన్ని గతేడాది జనవరిలో బీసీసీఐ పునరుద్ధరించింది. పర్యటనల సమయంలో ఆటగాళ్లంతా తప్పనిసరిగా జట్టుతోనే ప్రయాణించాలనే నిబంధనను కూడా బోర్డు అమలు చేస్తోంది.

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటికే అమెరికాపై విజయం సాధించింది. తదుపరి మ్యాచ్ ఎల్లుండి ఢిల్లీలో నమీబియాతో, ఆ తర్వాత ఈ నెల‌ 15న కొలంబోలో పాకిస్థాన్‌తో తలపడనుంది.


More Telugu News