Bandla Ganesh: ముగిసిన బండ్ల గణేశ్ యాత్ర... తిరుమలలో 'చంద్రబాబు మొక్కు' తీర్చుకున్న బండ్ల

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చేపట్టిన విజయసంకల్ప యాత్ర ముగిసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడమే కాకుండా, మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో, ఆయన శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. 

జనవరి 19న షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమలకు బండ్ల గణేశ్ విజయసంకల్ప యాత్రను చేపట్టారు. 23 రోజుల్లో దాదాపు 500 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర కొనసాగింది. నిన్న ఆయన తిరుపతికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి వద్ద రాత్రి ఆయన బస చేశారు. ఈ ఉదయం అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ఆయన కొండపైకి నడకమార్గంలో బయల్దేరారు. తిరుమల కొండపైకి చేరుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు. 

ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ... జైలు నుంచి చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని స్వామివారిని కోరుకున్నానని... తన కోరిక నెరవేరడంతో శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Bandla Ganesh
Chandrababu Naidu
Tirumala
Vijayasanakalpa Yatra
TDP
Andhra Pradesh Politics
Rajamundry Jail
Lord Venkateswara
Telugu Cinema
Pilgrimage

More Telugu News