PCB: భారత్‌తో మ్యాచ్ వివాదం.. ఐసీసీ ముందు పాకిస్థాన్ 3 షరతులు!

Pakistan sets 3 conditions to ICC for India match dispute
  • బంగ్లాదేశ్‌కు పరిహారం, పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని డిమాండ్
  • భవిష్యత్తు ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్య హక్కులు కోరిన పాకిస్థాన్
  • పీసీబీ ఛైర్మన్ మొండిపట్టు.. తుది నిర్ణయం కోసం ప్రధానితో భేటీ
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ముందు మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని గతంలో ప్రకటించిన పీసీబీ, ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో కాస్త మెట్టు దిగింది.

నిన్న‌ లాహోర్‌లో ఐసీసీ అధికారులతో జరిగిన సమావేశంలో పీసీబీ మూడు డిమాండ్లను ఉంచింది. టోర్నీ నుంచి వైదొలగిన బంగ్లాదేశ్‌కు పెరిగిన పరిహారం అందించాలని, టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఆ జట్టుకు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలని, భవిష్యత్తులో జరగబోయే ఏదైనా ఐసీసీ ఈవెంట్‌కు తమకు ఆతిథ్య హక్కులు కల్పించాలని పీసీబీ షరతులు పెట్టిన‌ట్లు స‌మాచారం.

కొలంబోలో ఈ నెల‌ 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీలోని కొందరు అధికారులు సుముఖంగా ఉన్నప్పటికీ, బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ విషయంలో సహకరించడం లేదని సమాచారం. ఇవాళ‌ ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మరోసారి సమావేశమై, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భద్రతా కారణాలను చూపి తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో గత నెలలో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి, స్కాట్లాండ్‌ను చేర్చింది. అప్పటి నుంచి పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తోంది. ‘ఫోర్స్ మేజర్’ క్లాజ్‌ను అడ్డం పెట్టుకుని మ్యాచ్ ఆడబోమని చెప్పడంపై వివరణ ఇవ్వాలని ఐసీసీ కోరడంతో పీసీబీ వైఖరిలో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో అతికష్టం మీద గెలిచింది.
PCB
Mohsin Naqvi
Pakistan Cricket Board
ICC
T20 World Cup 2026
India vs Pakistan
cricket match dispute
Shahbaz Sharif
Bangladesh cricket
tournament host rights

More Telugu News