Chandrababu Naidu: గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్... విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Orders Probe into Tribal School Food Poisoning
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లాలో గల ఓ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం దేవరపల్లిలోని ఆశ్రమ బాలుర వసతి గృహంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. శనివారం ఉదయం అల్పాహారం తిన్న తర్వాత 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయని అధికారులు సీఎంకు వివరించారు. వెంటనే వారిని మారేడుమిల్లి, రంపచోడవరంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు.

ఘటన జరిగిన వెంటనే హాస్టల్‌ను తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను అంచనా వేశామని అధికారులు తెలిపారు. హాస్టల్‌లో ఉన్న మిగతా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు, ఆహారం, నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపినట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణకు ఒక జాయింట్ ఇన్స్‌పెక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలతో పాటు, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
food poisoning
tribal school
Polavaram district
hospital
students health
investigation
Rampachodavaram

More Telugu News