Venkaiah Naidu: నేతల నోట బూతు మాటలు.. వెంకయ్యనాయుడు ఆసక్తికర స్పందన

Venkaiah Naidu Reacts to Abusive Language by Politicians
  • కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందన్న వెంకయ్య నాయుడు
  • కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన
  • అటువంటి వారికి ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్న వెంకయ్య నాయుడు
బూతులు మాట్లాడే రాజకీయ నేతలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే తగిన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీలో పలువురు రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై వెంకయ్యనాయుడు పలు సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలోనూ ఆయన రాజకీయ నాయకుల భాషపై స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులకు బూతులు మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిపోయిందని వెంకయ్యనాయుడు విమర్శించారు. అలా మాట్లాడితే పత్రికల్లో ప్రచురిస్తారని, వార్తల్లో వస్తామని భావించి అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 

సక్రమంగా మాట్లాడే సామర్థ్యం లేక కొందరు నేతలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపై కూడా వ్యాఖ్యలు చేసే దుస్థితికి దిగజారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి అన్ని పార్టీల నాయకుల్లోనూ ఉందని, అయితే కొందరు మాత్రం ఇంకా పద్ధతిగా, మంచిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసందర్భంగా ప్రసంగాలు చేసే నేతలకు ప్రజలు ఎన్నికల్లో నిశ్శబ్దంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసెంబ్లీ, పార్లమెంటులో మంచి విలువలు పెరుగుతాయని, భవిష్యత్తు తరాలు మంచి విషయాలను నేర్చుకుంటాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.
Venkaiah Naidu
AP Politics
Political Language
Abusive Language
Andhra Pradesh Politics
Pendurthi
Political Leaders
Elections
Public Discourse

More Telugu News