కర్ణాటక యువకుడికి యూఏఈలో జాక్‌పాట్.. లాటరీలో రూ.49 కోట్లు!

  • ఉడిపి జిల్లాకు చెందిన శంతను శెట్టిగర్‌కు రూ.49 కోట్ల ప్రైజ్ మనీ
  • స్నేహితుడితో కలిసి కొన్న టికెట్‌కు తగిలిన బహుమతి
  • డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్న విజేత
కర్ణాటకకు చెందిన ఓ యువకుడికి అదృష్టం తలుపుతట్టింది. యూఏఈలోని అబుదాబిలో నిర్వహించిన ప్రఖ్యాత ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హమ్స్ (దాదాపు రూ.49 కోట్లు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఉడిపి జిల్లా కటపాడి మట్టుకు చెందిన శంతను శెట్టిగర్ ఈ భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం ఒమన్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న ప్రవాస భారతీయుడైన శంతను, సిరీస్ 283లో భాగంగా 305810 నంబర్ గల టికెట్‌ను కొనుగోలు చేశాడు. డ్రాను ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, నిర్వాహకులు శంతనుకు ఫోన్ చేసి ఈ శుభవార్తను తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చూస్తుండగా తనకు జాక్‌పాట్ తగిలిందని తెలిసి అతను ఆనందంలో మునిగిపోయాడు.

ఈ సందర్భంగా నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడిన శంతను, "ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ డబ్బుతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు" అని చెప్పాడు. ఈ టికెట్‌ను తాను స్నేహితుడితో కలిసి కొన్నానని, నిబంధనల ప్రకారం ప్రైజ్ మనీని అతనితో పంచుకుంటానని తెలిపాడు. ఈ లాట‌రీతో శంతను శెట్టిగర్ బిగ్ టికెట్ చరిత్రలో అతిపెద్ద విజేతల్లో ఒకరిగా నిలిచాడు. ఇదే డ్రాలో మరో ఐదుగురు విజేతలు తలా 1 మిలియన్ దిర్హమ్స్‌తో పాటు ఒక లగ్జరీ కారును కూడా గెలుచుకున్నారు.




More Telugu News