జగన్ కు విజయవాడ పోలీసుల నోటీసులు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్న తరుణంలో, పర్యటన మార్గాన్ని మార్చాలని విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, జగన్ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి, ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, పర్యటనకు ఒక రోజు ముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ మార్గంలో వెళ్లవద్దని, వేరే దారిలో వెళ్లాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు జగన్ వెళ్లినప్పుడు భారీగా జనం తరలివచ్చారని, ఈ ప్రజా స్పందన చూసి కూటమి ప్రభుత్వం భయపడిందని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే ఇప్పుడు విజయవాడ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రపూరితంగా ఆంక్షలు విధిస్తోందని వైఎస్సార్సీపీ వర్గాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ముందస్తుగా సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో పోలీసులు మార్గాన్ని మార్చమంటున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News