వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజులుగా కొనసాగుతున్న లాభాల జోరుకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల సరళిపై స్పష్టత కోసం మదుపరులు వేచి చూసే ధోరణి అవలంబించడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 83,313 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 113 పాయింట్లు తగ్గి 25,642 వద్ద క్లోజ్ అయింది. బ్రాడర్ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.28 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 1.29 శాతం మేర పతనమైంది.

రంగాల వారీగా చూస్తే, పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 0.38 శాతం లాభపడటం మినహా మిగిలినవన్నీ నష్టాల బాట పట్టాయి. మెటల్ రంగం అత్యధికంగా 1.02 శాతం పతనం కాగా, ఐటీ, ఆటో రంగాలు అర శాతానికి పైగా నష్టపోయాయి.

ఇటీవల బాగా పెరిగిన షేర్లలో కొందరు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని విశ్లేషకులు తెలిపారు. అమెరికా-ఇరాన్ చర్చల పురోగతిపై స్పష్టత కోసం కూడా మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. నిఫ్టీకి 25,580–25,600 స్థాయి వద్ద మద్దతు లభించినప్పటికీ, సూచీ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. స్వల్పకాలంలో నిఫ్టీ 25,580 - 25,750 మధ్య కదలాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.32 వద్ద స్థిరంగా కొనసాగింది.




More Telugu News