కేటీఆర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్

  • నా జోలికి వస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని హెచ్చరిక
  • సిరిసిల్లను కేటీఆర్ నాశనం చేశారన్న బండి సంజయ్
  • తనపై వేల కేసులు పెట్టించారని మండిపాటు
  • తనకు భయపడి సిరిసిల్లలోనే మకాం వేశారని ఎద్దేవా
మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను, నాడు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ పక్కదోవ పట్టించారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నిధులను పక్కదారి పట్టించి వరదల్లో సిరిసిల్ల మునిగేలా చేశారని విమర్శించారు. సిరిసిల్లను కేటీఆర్ నాశనం చేశారని అన్నారు. వరదలు వస్తే సిరిసిల్లలో పలు కాలనీలు నీట మునుగుతాయని... కలెక్టరేట్ కూడా మునిగి, జిల్లా కలెక్టర్ ట్రాక్టర్ లో రావాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. 

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేటీఆర్ తనపై వేల కేసులు పెట్టించారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పుడు కోర్టుల నుంచి నోటీసులు పంపిస్తున్నారని దుయ్యబట్టారు. నా జోలికి వస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా అని హెచ్చరించారు. నీ అరాచకాలు, నీ నీచ పనులు బయటపెడతానని అన్నారు.

తనకు భయపడి సిరిసిల్లలోనే కేటీఆర్ మకాం వేశారని ఎద్దేవా చేశారు. ఓటుకు రూ. 5 వేల  నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో బలవంతంగా ఏడు గ్రామాలను కలిపి... అక్కడి పేదలకు ఉపాధి హామీ పనులు లేకుండా చేశారని మండిపడ్డారు. సిరిసిల్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను కేటీఆర్ సహా అందరికీ పంపిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని... మీరు ఓటు వేస్తే, తాను సిరిసిల్లను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వ్యభిచారం చేస్తోందని సంజయ్ అన్నారు. పార్టీ మారినట్టు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ... స్పీకర్ కేసు కొట్టేయడం దారుణమని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉండి... చరిత్రహీనులు కావద్దని సూచించారు.


More Telugu News

Bandi Sanjay KTR KTR Sircilla Telangana Politics BRS BJP Municipal Funds Sircilla Floods Telangana Congress Defection Politics