Pakistani Expats: విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీలకు కొత్త సమస్య!

Pakistani Expats Face Property Grabbing Issues in Pakistan
  • సొంతగడ్డపై ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న ప్రవాస పాకిస్థానీలు
  • దాదాపు 40 శాతం మంది ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు నివేదికలు
  • మోసాలకు పాల్పడుతున్న సొంత బంధువులు, అవినీతి అధికారులు
  • కాగితాలకే పరిమితమవుతున్న ఓవర్సీస్ ప్రాపర్టీ చట్టాలు
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా కాపాడుతున్నది విదేశాల్లో ఉన్న పాకిస్థానీలు పంపే రెమిటెన్సులే. అయితే, దేశానికి అండగా నిలుస్తున్న ఈ ప్రవాసులకు సొంతగడ్డపై మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోంది. విదేశాల్లో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులు కబ్జాల పాలవుతుండటంతో లక్షలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పాకిస్థాన్ ప్రముఖ పత్రిక 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ఈ నివేదిక ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న సుమారు 40 శాతం మంది పాకిస్థానీలు స్వదేశంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సొంత బంధువులే నమ్మకద్రోహానికి పాల్పడుతుండగా, స్థానిక నేరగాళ్లు, అవినీతి అధికారుల అండతో నకిలీ పత్రాలు సృష్టించి ఇళ్లు, భూములను ఆక్రమించుకుంటున్నారు. పట్టణాల్లోని వాణిజ్య భవనాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల వరకు ఏదీ సురక్షితంగా లేదని ఆ పత్రిక పేర్కొంది. తాము పంపే డబ్బుతో దేశం నడుస్తున్నా, తమ ఆస్తులకు రక్షణ లేకపోవడంపై ప్రవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 'ఫెడరల్ ఓవర్సీస్ ప్రాపర్టీ యాక్ట్-2024' వంటి చట్టాలను తీసుకొచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. నిబంధనల ప్రకారం ప్రత్యేక కోర్టులు 60 రోజుల్లో కేసులను పరిష్కరించాల్సి ఉన్నా, వాస్తవానికి కేసు నమోదు చేయడానికే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవేళ కోర్టులు ప్రవాసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఆక్రమణదారులను ఖాళీ చేయించడం పోలీసులకు సాధ్యం కావడం లేదని నివేదిక స్పష్టం చేసింది. పెట్టుబడుల కోసం విదేశీయులను ఆకర్షించాలనుకుంటున్న పాక్ ప్రభుత్వానికి, సొంత పౌరుల నుంచే నమ్మకం సన్నగిల్లడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.


More Telugu News

Pakistani Expats
Pakistan Economy
Overseas Pakistanis
Property Grabbing
Real Estate Disputes
Federal Overseas Property Act 2024
Remittances
Pakistan Property Issues