భారత్ ‘ఆర్థిక బ్రహ్మాస్త్రం’.. పాక్, బంగ్లాదేశ్‌లకు బిజినెస్ షాక్

  • యూరప్‌తో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం
  • పాక్, బంగ్లాదేశ్ ఎగుమతులకు గండి
  • టెక్స్‌టైల్ రంగంలో భారత్ ఆధిపత్యం
  • ప్రమాదంలో  పాక్ రూ. 75 వేల కోట్ల వ్యాపారం?
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (ఎఫ్‌టీఏ) అనే బ్రహ్మాస్త్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటివరకు యూరప్ మార్కెట్‌లో ఈ రెండు దేశాలు అనుభవిస్తున్న 'సుంకాలు లేని' ప్రయోజనాలకు భారత్ గండికొట్టింది.

గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్ (జీఎస్‌పీ + హోదా ద్వారా), బంగ్లాదేశ్ (ఎల్‌డీసీ దేశంగా) యూరప్‌కు తమ వస్త్రాలను ఎటువంటి పన్నులు లేకుండా ఎగుమతి చేస్తున్నాయి. కానీ భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 12 శాతం వరకు సుంకం ఉండేది. ఇప్పుడు తాజా ఒప్పందంతో భారత్‌కు కూడా 'జీరో డ్యూటీ' అవకాశం లభించింది. దీనివల్ల భారతీయ వస్తువుల ధరలు తగ్గి, నాణ్యతలో ముందుండటంతో యూరప్ వ్యాపారులు భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాకిస్థాన్ రక్షణ పరంగా బలహీనపడింది. ఇప్పుడు భారత్ ఆర్థికంగా కూడా తమను దెబ్బకొడుతోందని పాక్ వ్యాపార వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. "ఢిల్లీ ఇప్పుడు మాపై ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించింది" అని పాక్ ట్రేడర్స్ అసోసియేషన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు) ఎగుమతులు ప్రమాదంలో పడ్డాయి. అటు బంగ్లాదేశ్ కూడా తమ ఎగుమతులు పడిపోతాయని ఆందోళన చెందుతూ, యూరోపియన్ యూనియన్‌తో అత్యవసర చర్చలకు సిద్ధమవుతోంది.


More Telugu News