అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. కాసేపట్లో కోర్టుకు!

  • సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అంబటి రాంబాబు అరెస్ట్
  • నిన్న రాత్రి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • ఈ సాయంత్రం గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో (జీజీహెచ్) వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇవాళ ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు.

సీఎంపై వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అంబటిని అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఈరోజు ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

గుంటూరులో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ విషయంలో వివాదం చెలరేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అంబటి.. సీఎం చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఇంటిపై దాడి జరిగిందన్న వార్తలు కూడా వెలువడ్డాయి.

ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యేనని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.




More Telugu News