YS Sharmila: ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నా, బడ్జెట్ లో ఏపీకి వచ్చింది గుండు సున్నా: షర్మిల

YS Sharmila Slams AP Budget Allocation Under NDA Government
  • కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శ
  • ఎన్డీయేలో చంద్రబాబు కీలక పాత్రలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరలేదని ఆరోపణ
  • అమరావతికి నిధులు ఇవ్వకుండా అప్పులు అంటగట్టడం దుర్మార్గమని వ్యాఖ్య
  • పోలవరం ప్రాజెక్టుకు నిధులు తగ్గించి, ఎత్తు తగ్గించే కుట్ర చేస్తున్నారని ఫైర్
  • విభజన హామీలు, ప్రత్యేక హోదాను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారని, 50 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో ఏపీకి లభించింది గుండు సున్నా అని ఆమె విమర్శించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రులను దగా చేసిన బడ్జెట్ అని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కేంద్రం అణగదొక్కిందని ఆరోపించారు.

ఈ బడ్జెట్‌పై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "విభజన హామీలలో ఒక్కదానికీ దిక్కులేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. వెనకబడిన ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. రాష్ట్ర జీవనాడి పోలవరానికి నిధులు కేటాయించకుండా జీవం తీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కనికరం చూపలేదు, కడప స్టీల్ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడలేదు. మెట్రో రైలు, పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావనే లేదు" అని షర్మిల దుయ్యబట్టారు.

అమరావతి రాజధాని నిర్మాణంపై కేంద్రం తీరును ఆమె తప్పుబట్టారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించాలనుకున్న రాజధానికి కేవలం రూ.1,500 కోట్ల అప్పు ఇప్పిస్తామనడం దారుణమని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత కాదా అని ప్రశ్నించారు. గతేడాది ఇస్తామన్న రూ.15 వేల కోట్ల అప్పు ఏమైందని నిలదీశారు. 

పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.3 వేల కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచే ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదని, కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. రూ.20 వేల కోట్ల పునరావాస ప్యాకేజీ కోసం ప్రాజెక్టును బలిపెడుతున్నారని, ఇంత జరుగుతున్నా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం ఆయన పాలనా తీరుకు నిదర్శనమని విమర్శించారు.
YS Sharmila
Andhra Pradesh Budget
AP Congress
Chandrababu Naidu
Union Budget 2024
Polavaram Project
Special Status AP
Visakha Steel Plant
Amaravati Capital
Andhra Pradesh Reorganisation Act

More Telugu News