అజిత్ పవార్ మృతిపై రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు

  • విమాన ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేసిన నటి
  • దాదా మృతికి నివాళులు అర్పించిన రాఖీ సావంత్
  • నటి ధరించిన డ్రెస్ పై విమర్శలు చేస్తున్న నెటిజన్లు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ దివంగత నేత అజిత్ పవార్ కు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ శనివారం అజిత్ పవార్ కు నివాళులు అర్పించి మాట్లాడారు. బారామతి నియోజకవర్గ ప్రజలు దాదా అని పిలుచుకునే అజిత్ పవార్ మరణం తీరని లోటని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు దాదాకు నివాళులు అర్పించేందుకు వచ్చానని చెప్పారు.

అయితే, ఆయన మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయని, విమాన ప్రమాదం వెనక కుట్ర ఉందని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. కాగా, సంతాప కార్యక్రమానికి వస్తూ రాఖీ సావంత్ ధరించిన డ్రెస్ అభ్యంతరకరంగా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కార్యక్రమానికి అనుగుణంగా డ్రెస్ చేసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై కామెంట్లు చేస్తూ రాఖీ సావంత్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

విమాన ప్రమాదంపై దర్యాప్తు..
అజిత్ పవార్ సంతాప సభకు హాజరైన మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ గొప్ప నేతకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సమయమని, ఆయన కుటుంబ సభ్యుల దు:ఖాన్ని పంచుకోవాల్సిన సమయమని అన్నారు. ఈ విషాదకర సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. జామ్నేర్‌లో నిర్వహించిన అజిత్ పవార్‌ సంతాప సభకు అన్ని పార్టీల నేతలు తరలివచ్చి నివాళులు అర్పించారు.


More Telugu News