'కాంతార' సన్నివేశాన్ని అనుకరించిన బాలీవుడ్ నటుడు.. బెంగళూరులో కేసు నమోదు

  • హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనుకరించిన నటుడు
  • పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ప్రశాంత్ మెథల్ 
  • ది హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదు
'కాంతార' చిత్రంలోని సన్నివేశాన్ని అనుకరించారనే ఆరోపణలపై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాన్ని అనుకరించారని బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మెథల్ గత సంవత్సరం డిసెంబర్‌లో బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు నగరంలోని ది హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో నటుడిపై కేసు నమోదు చేసింది.

'కాంతార' చిత్రంలోని పంజుర్లి, గులిగ వ్యక్తీకరణలను రణ్‌వీర్ అనుచితరీతిలో అనుకరించారని ఆ ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు కర్ణాటక తీర ప్రాంత చాముండి దైవ సంప్రదాయాన్ని అవమానించారని పేర్కొన్నారు. అమ్మవారిని భూతంగా పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 8న తదుపరి విచారణ జరగనుంది. రణ్‌వీర్ సింగ్‌పై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 299 మరియు 302 కింద కేసు నమోదు చేశారు.

2025లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో కాంతారలోని ఒక సన్నివేశాన్ని రణ్‌వీర్ కామెడీ చేస్తూ అనుకరించారు. రణ్‌వీర్ తీరు కర్ణాటక ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత రణ్‌వీర్ క్షమాపణలు చెప్పారు. మన దేశంలోని అన్ని సంప్రదాయాలపై తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.


More Telugu News