విశాఖలో కివీస్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం

  • విశాఖ టీ20లో భారత్ ముందు 216 పరుగుల భారీ లక్ష్యం
  • మెరుపు అర్ధశతకంతో రాణించిన కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్
  • తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు
  • చివర్లో వేగంగా ఆడిన డారిల్ మిచెల్.. స్కోరు 215కి చేర్చిన వైనం
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ, కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. విధ్వంసకరంగా ఆడిన సీఫర్ట్ 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ఈ కీలక భాగస్వామ్యం విడిపోయిన తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నెమ్మదించింది. భారత బౌలర్లు పుంజుకోవడంతో కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. అయితే, చివర్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ కేవలం 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో కివీస్ స్కోరు 200 దాటింది. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌వి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. 

ఆదిలోనే భార‌త్‌కు భారీ దెబ్బ‌
ఇక‌, భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన టీమిండియాకు తొలి ఓవ‌ర్ తొలిబంతికే షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్నా కెప్టెన్ సూర్య‌కుమార్ కూడా 8 ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో భార‌త్ 9 ర‌న్స్‌కే రెండు వికెట్లు పారేసుకుంది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News