కరడుగట్టిన నేరస్తుడు అళగురాజాను ఎన్‌కౌంటర్ చేసిన తమిళనాడు పోలీసులు

తమిళనాడులో మరోసారి పోలీస్ ఎన్‌కౌంటర్ కలకలం సృష్టించింది. పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో కరడుగట్టిన నేరగాడు అళగురాజా హతమయ్యాడు. పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అళగురాజా తలకు బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు.

వివరాల్లోకి వెళితే.. హత్య, హత్యాయత్నం, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్ హత్యలు వంటి 30కి పైగా క్రిమినల్ కేసుల్లో అళగురాజా నిందితుడిగా ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడిగా పేరున్న ఇతను, చాలా సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా జిల్లాలను మారుస్తూ పరారీలో ఉన్నాడు. ఇటీవల మరో నేరగాడు కాళిముత్తుపై జరిగిన దాడి కేసులో అళగురాజా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో, నిఘా వర్గాల సమాచారంతో మంగళమెట్ ఇన్‌స్పెక్టర్ నందకుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆదివారం రాత్రి ఊటీలో అళగురాజాను, మరో ఆరుగురు అనుచరులను అరెస్ట్ చేసింది. అనంతరం, నిందితుడు దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను రికవరీ చేసేందుకు పెరంబలూరు జిల్లా తిరుమంతురై సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ ఆయుధాలను వెలికితీస్తున్న సమయంలో అళగురాజా అకస్మాత్తుగా కొడవలితో పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా దాడిని కొనసాగించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారికి గాయాలవగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అళగురాజా మరణంతో పలు జిల్లాల్లో విస్తరించిన ఓ పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఛేదించామని, అతని అనుచరులపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.


More Telugu News