ప్రధాని మోదీకి ఏపీ మాజీ మంత్రి ధర్మాన లేఖ
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై మోదీకి ధర్మాన లేఖ
- మీరు తెచ్చిన చట్టాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేసిందన్న ధర్మాన
- కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందన్న మాజీ మంత్రి
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సహకారంతో తయారు చేసిన ముసాయిదా చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశారని లేఖలో పేర్కొన్నారు.
"మీరు తీసుకువచ్చిన గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాల్లో అభివృద్ధి చారిత్రాత్మక నిర్ణయం. 566.23 కోట్ల రూపాయలతో 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తి చేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు" అని ఆయన అన్నారు. భూ రికార్డులను ఆధునికీకరించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.
మీరు తెచ్చిన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని, 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ప్రతిపాదించిన ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రులతో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ చట్టం అమలును సమీక్షించాలని ధర్మాన ప్రసాదరావు ప్రధాని మోదీని లేఖలో కోరారు.