నెల్లూరు జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం

  • నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • సీఐ బాబీ ఆదేశాల మేరకు మద్యం వ్యాపారుల నుంచి లక్ష లంచం డిమాండ్ చేసిన హెచ్‌సీ రామ్మోహన్ రాజు 
  • మద్యం వ్యాపారుల నుంచి రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న వైనం
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మద్యం వ్యాపారులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల లంచగొండితనం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు మద్యం వ్యాపారులను లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు అందింది.

సీఐ బాబీ రూ.1 లక్ష లంచం కోరగా, ఆయన ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు మద్యం వ్యాపారుల నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

లంచం తీసుకున్న హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా ఉన్న సీఐ బాబీని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఈ కేసులో మరి కొందరి సిబ్బంది పాత్ర ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఆకస్మిక ఏసీబీ దాడులతో జిల్లాలోని ఇతర పోలీస్ స్టేషన్లలో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. 


More Telugu News