భారత్‌ను తక్కువచేసి చూపొద్దు... విదేశీ వ్లాగర్లపై కెనడా మహిళ ఫైర్.. వీడియో వైరల్

  • భారత్‌ను పేద దేశంగా చిత్రీకరిస్తున్నారంటూ కెనడా మహిళ విమర్శ
  • విదేశీ వ్లాగర్ల తీరుపై సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఇతర దేశాల విషయంలో ఇలా చేయడం లేదని పోలిక
  • భారత ఆతిథ్యం, సౌందర్యాన్ని ఎందుకు చూపరని ప్రశ్న
భారత్‌ను పేద దేశంగా, గందరగోళ ప్రదేశంగా చిత్రీకరిస్తున్న విదేశీ కంటెంట్ క్రియేటర్ల తీరుపై ఓ కెనడియన్ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదరికాన్ని, రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వీడియోలు తీయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలామంది విదేశీ వ్లాగర్లు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ కోసం భారత్‌కు వచ్చి, కేవలం పాత ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని పరిస్థితులనే చిత్రీకరించి మొత్తం దేశం ఇలాగే ఉంటుందనే అభిప్రాయం కల్పిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇలాంటి చిత్రణ చాలా దారుణమని (terrible portrayal), ఇది భారతీయులపై ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకారాన్ని పెంచుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల విషయంలో ఇలాంటి పక్షపాత ధోరణి ఉండదని, ఉదాహరణకు వియత్నాం వెళ్లినప్పుడు అక్కడి అందమైన ప్రదేశాలనే చూపిస్తారు తప్ప, అత్యంత పేదరికాన్ని ఫోకస్ చేయరని ఆమె గుర్తుచేశారు.

తన భారత పర్యటన అనుభవాన్ని పంచుకుంటూ, ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో తనకు ప్రపంచ స్థాయి సేవలు అందాయని, ఇక్కడి ఆతిథ్య రంగం అద్భుతమని ప్రశంసించారు. పర్వతాలు, ఎడారులు, బీచ్‌లు వంటి ఎన్నో అందాలున్న భారత్‌లో ఆ సానుకూల కోణాన్ని ఎందుకు చూపరని ఆమె ప్రశ్నించారు.

ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. భారత నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొందరు "మనలో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి" అని కామెంట్ చేయగా, మరికొందరు మన దేశ గొప్పదనాన్ని మనమే చాటుకోవాలని సూచిస్తున్నారు. 



More Telugu News