అమరావతి ఒక నమ్మకం... సీఎన్ఎన్-న్యూస్18 కథనంపై మంత్రి లోకేశ్ స్పందన

Nara Lokesh Praises CNN News18 Story on Amaravati
  • అమరావతి కేవలం నిర్మాణం కాదని, అదొక నమ్మకమని చెప్పిన లోకేశ్
  • అమరావతిపై గ్రౌండ్ రిపోర్ట్ ప్రసారం చేసిన సీఎన్ఎన్‌కు ప్రశంసలు
  • అన్ని కోణాలను చూపించారంటూ జర్నలిస్ట్ రోహిణి స్వామికి అభినందనలు
  • రైతుల కష్టాలు, గృహ సముదాయాలను కథనంలో చూపించారని వెల్లడి
  • ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అమరావతి ప్రతిరూపమని వ్యాఖ్య
రాష్ట్ర రాజధాని అమరావతి కేవలం ఓ నిర్మాణ గాథ కాదని, అదొక నమ్మకమని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్-న్యూస్18 ప్రసారం చేసిన ప్రత్యేక కథనాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. కృష్ణా నది ఒడ్డున సుస్థిరమైన, ప్రజాకేంద్రీకృత, పచ్చని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనేది తమ దార్శనికత అని లోకేశ్ పేర్కొన్నారు.

అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, అలాగే ఈ ప్రాంత రైతుల కలలకు ప్రతిరూపమని ఆయన అభివర్ణించారు. అమరావతికి సంబంధించిన అన్ని కోణాలను తమ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు సీఎన్ఎన్-న్యూస్18 బృందానికి, జర్నలిస్ట్ రోహిణి స్వామికి లోకేశ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కథనంలో రాజధాని కోసం రైతులు పడిన కష్టాలను, వారి పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని ఆయన అన్నారు. అదే సమయంలో, ప్రస్తుతం నిర్మాణం పూర్తిచేసుకుని అందుబాటులోకి వస్తున్న గృహ సముదాయాల ప్రత్యేక ఫుటేజీని కూడా ప్రసారం చేశారని ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని ఆయన సూచించారు.
Go Back to Shorts
Nara Lokesh
Amaravati
Andhra Pradesh
AP Capital
CNN News18
Rohini Swamy
Farmers
Capital City
Green City
Sustainable City

More Telugu News