‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత నిహారిక కొత్త సినిమా.. ఆకట్టుకుంటున్న ‘రాకాస’ గ్లింప్స్

  • హీరోగా నటిస్తున్న సంగీత్ శోభన్
  • ఆసక్తి రేపుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్
  • సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న మూవీ
  • ఏప్రిల్ 3న సినిమా విడుదల
‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై సంగీత్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

గ్లింప్స్ ప్రారంభంలో "ప్రతీ కథలో ఒక సమస్య, దాన్ని పరిష్కరించడానికి ఒక వీరుడు ఉంటాడు" అంటూ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. ఆ వీరుడు తనేనంటూ సంగీత్ శోభన్ ఎలివేషన్ ఇచ్చుకోవడం ఆసక్తి రేపుతుంది. అయితే, ఆ వెంటనే కథ సెటైరికల్, కామెడీ టర్న్ తీసుకోవడంతో గ్లింప్స్ సరదాగా సాగుతుంది. దీన్నిబట్టి సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నట్లు స్పష్టమవుతోంది.

మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, నిహారికతో కలిసి ఉమేశ్‌కుమార్ బన్సల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.



More Telugu News