జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

  • అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట
  • కొబ్బరికాయ కొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించిన ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నాయకుల అభ్యంతరం
తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క జనగామ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

పెంబర్తి క్రాస్ వద్ద చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీతక్క, పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాదని, ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

మరోవైపు, కొబ్బరికాయ కొట్టేందుకు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆహ్వానించగా, ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేయగా, బీఆర్ఎస్ శ్రేణులు 'జై పల్లా' అంటూ ప్రతి నినాదాలు చేశారు.

Seethakka
Seethakka Janagama visit
Telangana Minister
Palla Rajeshwar Reddy
BRS vs Congress
Janagama
Telangana Politics
Chakali Ailamma

More Telugu News