విదేశీ ఇన్వెస్టర్ల ఎఫెక్ట్... భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
  • విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుదేలైన సూచీలు
  • ఒకేరోజు 769 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
  • బడ్జెట్ అంచనాలతో ఇన్వెస్టర్లలో ఆందోళన
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాలను చవిచూశాయి. శుక్రవారం ఉదయం గ్లోబల్ సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైనప్పటికీ... విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 81,537 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241 పాయింట్లు కోల్పోయి 25,048 వద్ద ముగిసింది.

బెంచ్‌మార్క్ సూచీలతో పోలిస్తే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో నష్టాలు తీవ్రంగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.95 శాతం, స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.06 శాతం మేర పతనమయ్యాయి. ఇక సెక్టార్ల వారీగా చూస్తే అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ రియల్టీ 3.42 శాతం, మీడియా 2.79 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 2.43 శాతం మేర డీలాపడ్డాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు కూడా 1 శాతానికి పైగా నష్టపోయాయి.

గ్రీన్‌లాండ్ విషయంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, దేశీయంగా పరిస్థితులు ప్రతికూలంగా మారాయని నిపుణులు విశ్లేషించారు. ముడి చమురు ధరల పెరుగుదల, కంపెనీల మిశ్రమ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు రూపాయి విలువ భారీగా పతనం కావడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో ఏకంగా 41 పైసలు తగ్గి 91.99కి చేరింది. రాబోయే కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.


More Telugu News