పవన్ కల్యాణ్, సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్

  • ప్రస్తుతం హరీశ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్న పవన్
  • తదుపరి సినిమాను తెరకెక్కించనున్న సురేందర్ రెడ్డి
  • మార్చి తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ ప్రచారం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే... తన సినీ ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ‘ఓజీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ లైనప్‌లో ఉంది. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా, వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై పవన్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది. మార్చి తొలి వారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఈ సినిమాలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ క్యారెక్టర్‌తో అభిమానులను అలరించనున్నారని టాక్. అంతేకాదు, ఇందులో మరో హీరో కూడా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సినీ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.



More Telugu News