సినీ పరిశ్రమలో మరో విషాదం.. గాయని ఎస్.జానకి కుమారుడి కన్నుమూత
- జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ
- మురళీకృష్ణ మృతి విషయాన్ని వెల్లడించిన గాయని చిత్ర
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు కలవరపెడుతున్న వేళ... మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. లెజెండరీ గాయని ఎస్. జానకి కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. ఇవాళ వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీకృష్ణ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషాద వార్తతో సినీ, సంగీత వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మురళీకృష్ణ మృతి విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్త తనను ఉలిక్కిపడేలా చేసిందంటూ ఆమె భావోద్వేగ పోస్టు పెట్టారు.
భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన మురళీకృష్ణ, నటుడిగా కూడా పలుచిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కళాత్మక కుటుంబానికి చెందిన ఆయన, తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పలువురు సినీ, సంగీత ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, జానకి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.