పాత వీడియో వైరల్.. 'జై హో' సాంగ్‌పై వివరణ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

  • తన మాటలను తప్పుగా అన్వయించుకున్నారని సోషల్ మీడియాలో వర్మ పోస్ట్
  • ఏఆర్ రెహమాన్ గొప్ప స్వరకర్త అని, ఇతరుల క్రెడిట్ తీసుకోరని ప్రశంస
  • సుఖ్వీందర్ సింగ్ స్వరపరిచారంటూ పాత వీడియో వైరల్ కావడమే కారణం
  • ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరుతున్నట్లు వెల్లడి
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'జై హో'పై తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తన మాటలను సందర్భానికి భిన్నంగా, తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్‌ను గొప్ప స్వరకర్తగా ప్రశంసిస్తూ ఈ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.

కొంతకాలం క్రితం రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'జై హో' పాటకు అసలు స్వరకర్త ఏఆర్ రెహమాన్ కాదని, గాయకుడు సుఖ్వీందర్ సింగ్ అని వ్యాఖ్యానించారు. ఈ పాత వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వర్మ స్పందించారు.

"జై హో పాట విషయంలో నా మాటలను తప్పుగా అన్వయించారు. నా దృష్టిలో ఏఆర్ రెహమాన్ నేను కలిసిన వారిలోకెల్లా గొప్ప స్వరకర్త, అద్భుతమైన వ్యక్తి. ఇతరుల క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునే రకం కాదు. ఈ నెగెటివిటీకి ఇంతటితో ముగింపు పలకాలని ఆశిస్తున్నా" అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.

గతంలో వర్మ ఈ ఆరోపణలు చేసినప్పుడు గాయకుడు సుఖ్వీందర్ సింగ్ స్వయంగా వాటిని ఖండించారు. 'జై హో' పాటకు రెహమానే సంగీతం అందించారని, తాను కేవలం పాడానని ఆయన అప్పుడే స్పష్టం చేయడం గమనార్హం. 


More Telugu News