ఢిల్లీ మెట్రోలో బరితెగింపు: ప్లాట్‌ఫారమ్‌పైనే మూత్ర విసర్జన

  • వీడియో తీస్తున్నారని గమనించి అక్కడి నుంచి పరుగు
  • వ్యక్తి తీరుపై నెటిజన్ల ఆగ్రహం
  • పరిశుభ్రత పాటించాలని ప్రయాణికులను కోరిన డీఎంఆర్‌సీ 
ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందించింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మెట్రో ప్లాట్‌ఫామ్‌ అంచున నిలబడి మూత్ర విసర్జన చేయడం కనిపించింది. తనను ఎవరో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ వ్యక్తి, వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియోను పలువురు ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో పోస్ట్ చేయడంతో లక్షలాది వ్యూస్ వచ్చాయి.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన డీఎంఆర్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది. "మెట్రో ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రయాణికులు సహకరించాలి. తోటి ప్రయాణికులు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే డీఎంఆర్‌సీ అధికారుల దృష్టికి తీసుకురావాలి" అని ఆ ప్రకటనలో కోరింది.

అయితే ఈ ఘటన ఏ మెట్రో స్టేషన్‌లో, ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు. వీడియో ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


More Telugu News