అమరావతిపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు: వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
- అమరావతిపై రాద్ధాంతాలు వద్దన్న వెంకయ్యనాయుడు
- రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన
- అమరావతి పెద్ద నగరంగా మారనుందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాష్ట్రంలో మధ్యలో ఉందని... రాష్ట్రానికి గుండెలా పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని, అది తగదని హితవు పలికారు. అమరావతిపై అనవసర రాద్ధాంతాలు వద్దని అన్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని... అందుకే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమరావతిని రాజధానిగా గుర్తించి, అక్కడ అభివృద్ధి పనులను జోరుగా కొనసాగిస్తున్నాయని చెప్పారు. అమరావతి అంటే కేవలం ఒక చిన్న గ్రామం కాదని... విజయవాడ, గుంటూరు, గన్నవరం, మంగళగిరి ఇలా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కలిసి ఒక పెద్ద నగరంగా మారనుందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హాస్య నటుడు బ్రహ్మానందం, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు కూడా పాల్గొన్నారు.