నన్ను చూసి భారత్ వణుకుతోంది: లష్కరే ఉగ్రవాది సైఫుల్లా కసూరి ప్రగల్భాలు

  • కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కసూరి హెచ్చరిక
  • పాక్ సైనిక కార్యక్రమాలకు, సైనికుల అంత్యక్రియలకు తనను పిలుస్తారన్న ఉగ్రవాది
  • పహల్గామ్ దాడితో తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని వ్యాఖ్య
  • భారత్ మెరుపు దాడుల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్లు అంగీకారం
తన ఉనికి చూసి భారతదేశం భయపడుతోందని లష్కరే తోయిబా (LeT) టాప్ లీడర్, పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ మిషన్ నుంచి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రగల్భాలు పలికాడు.

అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతున్న పాకిస్థాన్ ముసుగును కసూరి ఈ సందర్భంగా తొలిగించాడు. "పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది. యుద్ధంలో చనిపోయిన సైనికులకు అంత్యక్రియల ప్రార్థనలు (Funeral Prayers) నేనే నిర్వహిస్తాను" అని చెబుతూ పాక్ సైన్యం, ఉగ్రవాదులు ఎంతటి లోతైన సంబంధం కలిగి ఉన్నారో బయటపెట్టాడు.

గతేడాది పహల్గామ్ దాడిలో 26 మంది అమాయక పౌరులను చంపిన ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను కసూరి ప్రస్తావించాడు. ఆ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని అంగీకరించాడు. అయితే, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం భారత్ చేసిన పొరపాటని, తమ పోరాటం కొనసాగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ దాడి తర్వాత తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోందని కసూరి పేర్కొన్నాడు. 


More Telugu News