నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో మంత్రి అజారుద్దీన్?
- కవిత రాజీనామాతో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానంపై గాంధీభవన్లో చర్చ
- గవర్నర్ కోటా నియామకంపై సందిగ్ధత.. మంత్రి పదవి కోసం తప్పనిసరి ఎన్నిక
- ఏప్రిల్ 31లోగా చట్టసభ సభ్యత్వం పొందాల్సిన అనివార్య పరిస్థితి
- మున్సిపల్ ఎన్నికల అనంతరం ఉప ఎన్నిక నిర్వహణకు కసరత్తు
గత ఏడాది అక్టోబరు 31న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్కు ఏప్రిల్ నాటికి గడువు ముగుస్తుంది. గవర్నర్ కోటా నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో రాజ్భవన్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని నిలబెట్టుకోవాలంటే ఎన్నికల ద్వారా చట్టసభకు వెళ్లడం ఒక్కటే మార్గం. దీంతో కవిత ఖాళీ చేసిన స్థానాన్ని అజారుద్దీన్కు కేటాయించి, ఆయనను మండలికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో ఓటరు జాబితా రూపొందించి, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని, తద్వారా అజారుద్దీన్ను గెలిపించుకోవడం సులభమవుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలు ఆలస్యమైనా, కేవలం మున్సిపల్ ఓటర్లతోనే ఉప ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.