జగన్ బయటకు మృదువుగా కనిపిస్తాడు కానీ..!: ఆనం రామనారాయణరెడ్డి

  • జగన్ లోపల చాలా కర్కశంగా ఉంటాడన్న ఆనం
  • అన్నీ మంచి పనులే చేశానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా
  • అమాయకుల జీవితాలను నాశనం చేశాడని మండిపాటు

వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ బయటకు మృదువుగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం కఠినంగా, కర్కశంగా ఉంటాడని ఆనం వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలు ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరించడాన్ని చూసి, దానికి ప్రజలే తప్పు చేశారని జగన్ అనడం అతని అవివేకానికి స్పష్టమైన ఉదాహరణ అని మండిపడ్డారు. 


జగన్ హయాంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలను ప్రోత్సహించడం వల్ల యువత శక్తిని నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలోని యువకుల జీవితాలను నాశనం చేశారని ఆరోపించారు. తన పాలనలో అన్నీ మంచి పనులే చేశానని జగన్ చెప్పుకుంటున్నాడు కానీ, వాస్తవానికి తన ఉనికిని కాపాడుకోవడం కోసమే అలా అంటున్నాడని విమర్శించారు. 

కుప్పంలో హంద్రీ-నీవా కాలువలో కృత్రిమంగా నీరు పారించి, అది తన ఘనకార్యమని చెప్పుకున్న జగన్, అమాయకులను వాడుకుని వాళ్ల జీవితాలను నాశనం చేశాడని మంత్రి ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు రాజకీయంగా హీట్ పెంచుతాయని... అయితే, సామాన్యులు ఇవి నిజమా కాదా అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుంటే వైసీపీ దాన్ని జీర్ణించుకోలేకపోతోందని, విధ్వంసం చేయడం, అరాచకాలు సృష్టించడమే వాళ్ల సిద్ధాంతమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే తపనతో పనిచేస్తోందని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం కరవు కాటకాలతో సతమతమవుతుంటే, చంద్రబాబు హయాంలో సస్యశ్యామలంగా మారుతోందని తెలిపారు. అమరావతి రాజధానిని నీరుగార్చినందుకు అక్కడి గ్రామాల ప్రజలు ఇప్పటికీ జగన్ను ఛీకొడుతున్నారని వ్యాఖ్యానించారు.



More Telugu News