దూసుకొస్తున్న 'ఓర్ణబ్' తుపాను.. శ్రీలంక తీరం వైపు పయనం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకుపోతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. శుక్రవారం ఉదయానికి ఇది తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన 'ఓర్ణబ్' అనే పేరును ఖరారు చేశారు.

ప్రస్తుతం శ్రీలంకలోని పొట్టువిల్‌కు 250 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను వాయవ్య దిశగా కదులుతోంది. శుక్రవారం రాత్రి శ్రీలంకలోని పొట్టువిల్-ట్రింకోమలి మధ్య ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర తగ్గాయి.

రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో శుక్రవారం నుంచి సోమవారం వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది.

Cyclone Ornab
Ornab cyclone
Sri Lanka cyclone
Tamil Nadu rains
Kerala rains
IMD
Bay of Bengal cyclone
Andhra Pradesh weather
South coastal Andhra Pradesh
Rayalaseema rains

More Telugu News