ఈడీ సోదాలు జరుగుతుండగా ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి మమత... బెంగాల్ లో పొలిటికల్ హీట్

  • ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు
  • ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రేనన్న మమత
  • సోదాలు జరుగుతున్న ప్రాంతానికి స్వయంగా వెళ్లిన దీదీ
  • పార్టీ పత్రాలను ఈడీ తీసుకెళ్లకుండా అడ్డుకున్నానని వెల్లడి
  • మమత తీరుపై విపక్ష నేత సువేందు అధికారి తీవ్ర విమర్శలు
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి మరోసారి భగ్గుమంది. ప్రముఖ ఎన్నికల వ్యూహరచన సంస్థ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పన్నిన కుట్రేనని, దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గపు, నీచమైన హోంమంత్రిని చూడలేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గురువారం ఉదయం నుంచి కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. కేంద్ర సాయుధ బలగాల (సీఏపీఎఫ్) పటిష్ట భద్రత నడుమ ఈ దాడులు జరిగాయి. విషయం తెలుసుకున్న వెంటనే మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

“నా పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. నేను వాటిని తిరిగి తీసుకువచ్చాను. ఈ పనికిమాలిన కేంద్ర హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా నా పార్టీ పత్రాలను లాక్కోవాలని చూస్తున్నారు. నేను ప్రతీక్‌కు ఫోన్ చేశాను. అతని ఫోన్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవాలని అధికారులు చూశారు”అని మమత ఆరోపించారు. 

అనంతరం సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా వెళతానని ఆమె తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

“గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారు. సీబీఐకి వ్యతిరేకంగా నగరంలో ధర్నాకు దిగారు. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే ఆమెకెందుకు అంత ఆందోళన?” అని సువేందు అధికారి ప్రశ్నించారు. ఈ ఘటనతో బెంగాల్‌లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.


More Telugu News