ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. 20 ఏళ్ల తర్వాత క్షమాపణ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ ప్రెస్

  • ఛత్రపతి శివాజీ వారసుడికి క్షమాపణ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ ప్రెస్
  • 20 ఏళ్ల క్రితం ప్రచురితమైన పుస్తకంలోని వ్యాఖ్యలపై వివాదం
  • పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలు నిర్ధారించుకోనివి అని అంగీకారం
  • ప్రజలకు కలిగిన ఆవేదనకు చింతిస్తున్నామని ప్రకటన
ఛత్రపతి శివాజీ మహారాజ్ 13వ తరం వారసుడైన ఉదయన్‌రాజే భోంస్లేకు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) క్షమాపణలు తెలియజేసింది. రెండు దశాబ్దాల క్రితం తాము ప్రచురించిన ఓ పుస్తకంలో శివాజీ గురించి నిర్ధారించుకోని వ్యాఖ్యలు ఉన్నాయని అంగీకరించింది. ఈ మేరకు ఓ పత్రికలో బహిరంగ ప్రకటన జారీ చేసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
అమెరికన్ రచయిత జేమ్స్ లైన్ రాసిన 'శివాజీ: హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా' అనే పుస్తకాన్ని 2003లో ఓయూపీ ప్రచురించింది. ఈ పుస్తకంలోని 31, 33, 34, 93 పేజీలలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు అవాస్తవాలని, వాటిని నిర్ధారించుకోలేదని ఓయూపీ ఇండియా తమ ప్రకటనలో అంగీకరించింది. ఈ వ్యాఖ్యల ప్రచురణ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని, దీనివల్ల ఉదయన్‌రాజే భోంస్లేతో పాటు ప్రజలకు కలిగిన బాధకు, ఆవేదనకు క్షమాపణ కోరుతున్నామని పేర్కొంది. ఓయూపీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సయీద్ మంజార్ ఖాన్ తరఫున ఈ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.

కాగా, ఈ పుస్తకం విడుదలైన సమయంలో పెను వివాదం చెలరేగింది. శివాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, రచయితకు పుణెలోని ప్రఖ్యాత భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BORI) సహాయం చేసిందని ఆరోపిస్తూ.. 2004 జనవరిలో సంభాజీ బ్రిగేడ్‌కు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు ఆ సంస్థపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ నుంచి క్షమాపణ రావడం గమనార్హం.


More Telugu News