ఏపీ గోల్డెన్ అథ్లెట్ జ్యోతి యర్రాజిని సత్కరించిన మంత్రి నారా లోకేశ్... రూ. 30.35 లక్షల ఆర్థిక సాయం

  • ఏషియన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీతో మంత్రి లోకేశ్ భేటీ
  • జ్యోతి యర్రాజీ ఏపీ గర్వకారణమని ప్రశంస
  • ఆమె శిక్షణ కోసం ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం
  • ఒలింపిక్స్ ప్రయాణంలో పూర్తి అండగా ఉంటామని లోకేశ్ హామీ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ అథ్లెట్ జ్యోతి యర్రాజిని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో సరికొత్త మీట్ రికార్డుతో స్వర్ణ పతకం సాధించిన జ్యోతిని ఆయన ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతి యర్రాజికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 30.35 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

జ్యోతి యర్రాజీతో భేటీ అయిన అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన జ్యోతి యర్రాజిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆమె పట్టుదల, కృషి దేశానికే స్ఫూర్తిదాయకం" అని కొనియాడారు. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌కు సిద్ధమయ్యేందుకు ఈ ఆర్థిక సహాయం అందించామని వివరించారు.

భవిష్యత్తులో జ్యోతి యర్రాజి ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో విజయం సాధించాలనే ఆమె ప్రయాణంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.


More Telugu News