క్రీడల్లో ఈ రాజకీయ పిచ్చి ఏంటి?.. ముస్తాఫిజుర్ తొలగింపుపై థరూర్ ఫైర్!

  • హింసకు సంబంధం లేని ఆటగాడిని శిక్షించడం ఎంతవరకు న్యాయమని నిలదీత
  • షారూఖ్ ఖాన్‌ను ‘ద్రోహి’ అని విమర్శించిన బీజేపీ నేత సంగీత్ సోమ్‌
  • బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్‌లో ప్రకంపనలు
ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తొలగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా స్పందించారు. క్రీడలను రాజకీయాలతో కలపడం ‘పిచ్చి చర్య’ అని అభివర్ణించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు, ముస్తాఫిజుర్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. "మనం ఎవరిని శిక్షిస్తున్నాం? ఒక దేశాన్నా, ఒక వ్యక్తినా లేక అతడి మతాన్నా?" అంటూ థరూర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

ఒకవేళ ముస్తాఫిజుర్ స్థానంలో హిందూ క్రికెటర్లయిన లిటన్ దాస్ లేదా సౌమ్య సర్కార్ ఉంటే బీసీసీఐ ఇలాగే స్పందించేదా? అని థరూర్ సూటిగా ప్రశ్నించారు. ముస్తాఫిజుర్ ఎప్పుడూ ద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదని, అతడొక క్రీడాకారుడు మాత్రమేనని గుర్తుచేశారు. పొరుగు దేశాలను ఇలా క్రీడల పరంగా బహిష్కరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, భారత్ ‘విశాల హృదయం’తో ఆలోచించాలని హితవు పలికారు.

ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్ యజమాని షారూఖ్ ఖాన్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత సంగీత్ సోమ్ ఏకంగా షారూఖ్‌ను 'దేశద్రోహి' అని సంబోధించడంతో వివాదం ముదిరింది. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపుతుంటే, అక్కడి ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడం సహించబోమని బీజేపీ, శివసేన నేతలు హెచ్చరించారు. ఈ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలోనే బీసీసీఐ అతడిని తొలగించాలని ఆదేశించింది.

మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు మరింత దారుణంగా మారుతున్నాయి. శనివారం ఖోకన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలే ఇప్పుడు ఐపీఎల్ మైదానంలో సెగలు పుట్టిస్తున్నాయి.


More Telugu News