NTR Bharosa: పింఛన్‌దారులకు కొత్త ఏడాది కానుక.. నేడే 'ఎన్టీఆర్ భరోసా' పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ఇచ్చే 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్లను, ఈసారి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ నెలలో మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసేందుకు ప్రభుత్వం రూ.2,743.04 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర కేటగిరీల పింఛన్‌దారులందరికీ నగదు కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. కొత్త ఏడాది మొదటి రోజే పండుగలా ఉండాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

గతంలో మాదిరిగానే సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్మును అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మారుమూల ప్రాంతాల్లోనూ పంపిణీ సజావుగా సాగేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండనుంది.

కొత్త ఏడాది సంబరాల్లో ఉన్న ప్రజలకు ఈ ముందస్తు పంపిణీ ఒక ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పింఛను అందజేసే సమయంలో లబ్ధిదారులకు ప్రభుత్వ పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతోనే ఈ ముందస్తు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
NTR Bharosa
Andhra Pradesh
Pension Distribution
Chandrababu Naidu
AP Pensions
Social Security
Welfare Schemes
AP Government
Pensioners

More Telugu News