ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్
  • జీవిత ఖైదును నిలిపివేసి, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
  • ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్తూ, అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కుల్దీప్ దోషిగా తేలిన వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని, డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పేర్కొన్నారు.

కుల్దీప్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కుల్దీప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

2017లో కుల్దీప్ సెంగర్ యూపీలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2019 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు, సంబంధిత ఇతర కేసులను, యూపీలోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు.

ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కుల్దీప్ శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అప్పటికే అతను ఏడు సంవత్సరాల ఐదు నెలలు జైలులో గడిపాడని చెబుతూ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై బాధితురాలి తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


More Telugu News