'శంబాల' సినిమాపై ప్రభాస్ ప్రశంసలు

  • ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కిన 'శంబాల'
  • సినిమా అద్భుతమైన విజయం సాధించిందన్న ప్రభాస్
  • జనవరి 9న విడుదలవుతున్న ప్రభాస్ చిత్రం 'రాజాసాబ్'

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా అంటేనే అభిమానులకు పండగగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయారు. భారీ బడ్జెట్ చిత్రాలు, విభిన్న కథలతో తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ తాజా చిత్రం ‘రాజాసాబ్’ విడుదలకు సిద్ధంగా ఉంది.


హారర్, కామెడీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ ఓ డిఫరెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. జనవరి 9న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.


ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తోటి నటుల విజయాలను గుర్తించి అభినందించడం ప్రభాస్‌కు కొత్త కాదు. ఈసారి కూడా అదే చేశారు. టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై ప్రభాస్ స్పందించారు.


ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా "ఆది అండ్ టీమ్‌కు కంగ్రాట్యులేషన్స్... 'శంబాల' సినిమా అద్భుతమైన విజయం సాధించింది" అంటూ ప్రశంసలు కురిపిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేశారు. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన 'శంబాల' సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా నిలకడగా వసూళ్లు రాబడుతోంది.



More Telugu News