పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, హాఫ్ ప్యాంట్లు బంద్.. పెళ్లిళ్లపైనా ఆంక్షలు: యూపీలో ఖాప్ పంచాయతీ హుకుం

  • 18 ఏళ్ల లోపు వారు మొబైల్ వాడకూడదని, బయట షార్ట్స్ వేయకూడదని నిర్ణయం
  • పాశ్చాత్య పోకడలు వద్దని, సంప్రదాయ దుస్తులే ముద్దు అంటూ పిలుపు
  • మ్యారేజ్ హాళ్లకు బదులుగా ఇళ్లలోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ఆదేశం
  • ఖర్చు తగ్గించేందుకు వాట్సాప్ ద్వారానే శుభలేఖలు పంపాలన్న ఖాప్ పంచాయతీ
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన 'థాంబా పట్టి మెహర్ దేశ్ ఖాప్' పంచాయతీ సామాజిక విలువల పరిరక్షణ పేరుతో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువత దారి తప్పుతోందని, క్రమశిక్షణ లోపిస్తోందని భావించిన ఖాప్ నేతలు.. విద్యార్థులు, యువత జీవనశైలిపై కఠిన ఆంక్షలు విధించారు.

18 ఏళ్ల లోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్లు వాడటం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గడమే కాకుండా పెద్దల పట్ల అవిధేయత పెరుగుతోందని ఖాప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే టీనేజర్లకు మొబైల్ ఫోన్లను నిషేధించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో అబ్బాయిలు హాఫ్ ప్యాంట్లు, అమ్మాయిలు షార్ట్స్ ధరించకూడదని ఆదేశించారు. అబ్బాయిలు కుర్తా-పైజమా, అమ్మాయిలు సల్వార్-కమీజ్ వంటి సంప్రదాయ దుస్తులే ధరించాలని సూచించారు. ఇంట్లో ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చని, కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం 'సామాజిక నిబంధనలు' పాటించాలని హుకుం జారీ చేశారు.

కేవలం యువతపైనే కాకుండా వివాహ వేడుకల విషయంలోనూ ఖాప్ పంచాయతీ కీలక మార్పులు సూచించింది. వివాహాలు మ్యారేజ్ హాళ్లలో కాకుండా గ్రామాల్లో లేదా సొంత నివాసాల్లోనే జరుపుకోవాలని పేర్కొంది. మ్యారేజ్ హాల్ కల్చర్ వల్ల కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. పెళ్లి పత్రికల ముద్రణ ఖర్చును తగ్గించేందుకు వాట్సాప్ ద్వారా ఆహ్వానాలు పంపడం ఉత్తమమని స్పష్టం చేశారు.

ఖాప్ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయాలకు రాజకీయ నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత చౌదరి యశ్‌పాల్ సింగ్, ఆర్ఎల్‌డీ ఎంపీ రాజ్‌కుమార్ సాంగ్వాన్ ఈ నిర్ణయాలను సమర్థించారు. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఇటువంటి నిర్ణయాలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. ఈ నియమాలను ఉత్తరప్రదేశ్ అంతటా అమలు చేసేందుకు ఇతర ఖాప్ కౌన్సిళ్లతో కూడా చర్చలు జరుపుతామని ఖాప్ ప్రతినిధులు తెలిపారు.


More Telugu News