ఆ పథకం రద్దు చేసి పేదల కడుపు కొట్టారు: మల్లికార్జున ఖర్గే

  • ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డి
  • ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని ఆగ్రహం
  • దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని వ్యాఖ్య
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సహా పలువురు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి పేదల కంటే కార్పొరేట్ సంస్థలకే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏను ఆయన వ్యవసాయ చట్టాలతో పోల్చారు. నాడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగా, ఉపాధి హామీ చట్టం రద్దుకు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌరుల హక్కులకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించడానికి నాటి యూపీఏ ప్రభుత్వం ముందుచూపుతో గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు.


More Telugu News