ఇంటికే నిప్పు పెట్టే యత్నం.. అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్

  • కుటుంబ సభ్యులను బెదిరించాడన్న ఆరోపణలు
  • టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతున్న మనోజ్ సాయి
  • ఆర్సన్, టెర్రరిస్టిక్ థ్రెట్ కింద కేసుల నమోదు
అమెరికాలో భారత సంతతికి చెందిన 22 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. సొంత కుటుంబ సభ్యులనే బెదిరించడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడన్న తీవ్ర ఆరోపణలపై అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చదువుతున్న మనోజ్ సాయి లెల్ల సోమవారం అరెస్ట్ అయ్యాడు. కొన్ని రోజులుగా మనోజ్ మానసిక ఆందోళనతో ఉన్నాడని, తమను బెదిరిస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు అతను తాము నివసిస్తున్న ఇంటికి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించాడని వారు ఆరోపించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్ ఇంటికి చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. నివాసానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినందుకు ఫస్ట్-డిగ్రీ ఫెలోనీ కింద, కుటుంబ సభ్యులను బెదిరించినందుకు క్లాస్ ఏ మిస్‌డీమనర్ కింద కేసులు నమోదు చేశారు. నిందితుడికి కోర్టు రెండు కేసుల్లో కలిపి సుమారు 1,03,500 డాలర్ల బాండ్‌ను ఖరారు చేసింది.


More Telugu News