గ్వాలియర్‌లో కైలాశ్ ఖేర్ కచేరీలో రచ్చ.. జంతువుల్లా ప్రవర్తించారంటూ ఆగ్రహం

  • వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని సంగీత విభావరి
  • బారికేడ్లు తెంచుకుని స్టేజీపైకి దూసుకెళ్లిన జనం
  • కైలాశ్ హెచ్చరించినా ఫలితం శూన్యం
  • భద్రతా వైఫల్యంతో మధ్యలోనే నిలిపివేత
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ సంగీత ప్రదర్శనలో తీవ్ర గందరగోళం నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు నియంత్రణ కోల్పోయి బారికేడ్లను దూకడమే కాకుండా, స్టేజీపైకి ఎగబాకడంతో కైలాశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు.

కైలాశ్ తన హిట్ పాటలతో అలరిస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా వేదికపైకి దూసుకువచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పాటను ఆపి మైకులో అభిమానులను హెచ్చరించారు. "మా దగ్గరకు కానీ, మా సంగీత పరికరాల దగ్గరకు కానీ ఎవరైనా వస్తే కార్యక్రమాన్ని ఇప్పుడే ఆపేస్తాం. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం, కానీ ప్రస్తుతం మీరు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు" అంటూ ఘాటుగా విమర్శించారు. పరిస్థితిని అదుపులోకి తేవాలని సీనియర్ పోలీసు అధికారులను కోరారు. అయితే, అక్కడ తగినంత భద్రత లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సరిపడా సెక్యూరిటీ లేకపోవడంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన కైలాశ్ ఖేర్ కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజు ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే వేదికపై ప్రసంగించినప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉందని, కానీ గాయకుడి కార్యక్రమం వచ్చేసరికి యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కర్ణాటకలో జరిగిన ఒక ప్రదర్శనలో కూడా కైలాశ్ ఖేర్‌పై బాటిళ్లతో దాడి జరిగిన సంఘటనను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 


More Telugu News