Arunachal Pradesh: చైనా రాజీపడని ప్రయోజనాల్లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్: పెంటగాన్ రిపోర్టు

Arunachal Pradesh Part of Chinas Non Negotiable Interests Pentagon Reports
షార్ట్స్‌లో చూడండి
అరుణాచల్ ప్రదేశ్ తమకెంతో ముఖ్యమని, రాజీపడని ప్రయోజనాల్లో ఒకటని చైనా భావిస్తోందని అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో పెంటగాన్ పేర్కొంది. 2049 నాటికి జాతీయ పునరుజ్జీవనాన్ని సాధించాలనే లక్ష్యంతో చైనా ఉందని నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా, చైనా తన నాయకత్వ పరిధిని విస్తరించాలని భావిస్తున్నట్లు పెంటగాన్ అభిప్రాయపడింది. తైవాన్, సెంకాకు ద్వీపాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా బీజింగ్ యొక్క విస్తృత జాతీయ భద్రతా ప్రణాళికల్లో భాగమని తెలిపింది.

ఈ భూభాగాలు చైనా జాతీయ పునరుజ్జీవనానికి కీలకమని డ్రాగన్ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పాలనను వ్యతిరేకించిన హాంగ్‌కాంగ్, టిబెట్, తైవాన్ రాజకీయ నాయకులను వేర్పాటువాదులుగా ముద్ర వేసినట్లు కూడా నివేదిక తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ భారత్, చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందం గురించి పెంటగాన్ తన నివేదికలో ప్రస్తావించింది.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ నివేదిక పేర్కొంది. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలపడకుండా ఉండేలా చైనా జాగ్రత్త పడుతోందని వివరించింది. జాతీయ పునరుజ్జీవనానికి బీజింగ్ మూడు ప్రధాన ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకుందని, అందులో చైనా కమ్యూనిస్టు పార్టీపై నియంత్రణ, దేశ ఆర్థికాభివృద్ధి, సార్వభౌమాధికారం, ప్రాదేశిక వాదనలు కొనసాగించడం వంటివి ఉన్నాయని పేర్కొంది.
Go Back to Shorts
Arunachal Pradesh
China
Pentagon Report
India China Border
National Rejuvenation
Taiwan

More Telugu News