KCR: ‘కేసీఆర్ ఎలా ఉన్నారు?’.. బీఆర్ఎస్ ఎంపీలను అడిగి తెలుసుకున్న ప్రధాని

PM Modi Asks BRS MPs About KCR Health
షార్ట్స్‌లో చూడండి
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. తనను కలిసిన బీఆర్ఎస్ ఎంపీలతో ‘‘కేసీఆర్‌ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఈ మాట నేను ప్రత్యేకంగా చెప్పానని ఆయనకు తెలియజేయండి’’ అని మోదీ సూచించారు.

శుక్రవారం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు పొడిగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చారని, గతంలో కేంద్ర మంత్రి ఒకరు హామీ ఇచ్చారని వారు ప్రధానికి గుర్తుచేశారు. ఈ రహదారి విస్తరణతో వేములవాడ క్షేత్రానికి ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతుందని వివరించారు.

ఈ క్రమంలో మిడ్‌ మానేరుపై ధవళేశ్వరం తరహాలో రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి నిర్మించాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో సహకరించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నీ విన్న తర్వాత ప్రధాని మోదీ.. కేసీఆర్ బాగోగుల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.  
Go Back to Shorts
KCR
K Chandrasekhar Rao
Narendra Modi
BRS
BRS MPs
Telangana
National Highway 365B
Vemulawada
KTR
Road cum Rail Bridge

More Telugu News